బెంగాల్ తేయాకు రైతును కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు!
- ఇండియాలోకి చొరబడుతున్న అక్రమ చొరబాటుదారుడిని పట్టుకున్న బీఎస్ఎఫ్
- ప్రతీకారంతో బెంగాల్ తేయాకు రైతును కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు
- స్థానిక తేయాకు తోటల సంఘాల ఆందోళన
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఒక బంగ్లాదేశీ చొరబాటుదారుడిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా... బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించి దీపాంకర్ గోప్ అనే భారతీయ తేయాకు రైతును అపహరించి బంగ్లాదేశ్కు తీసుకెళ్లారు. తమ దేశానికి చెందిన వ్యక్తిని భారత్ విడుదల చేస్తేనే, రైతును తిరిగి పంపిస్తామని బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలు (బీజీబీ), స్థానికులు దబాయిస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాజ్గంజ్ బ్లాక్ పరిధిలోని సరిహద్దు కంచెకు సమీపంలో ఉన్న తన తేయాకు తోటలో పనిచేసుకుంటున్న దీపాంకర్పై దాదాపు 15 మందికి పైగా బంగ్లాదేశీయులు ఒక్కసారిగా దాడి చేసి, ఈడ్చుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్ఎఫ్ అధికారులు, బంగ్లాదేశ్ బీజీబీ అధికారులతో అత్యవసర ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి రైతును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో రైతులకు భద్రత లేకపోవడంపై స్థానిక తేయాకు తోటల సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.