దేశంలో అత్యుత్తమ జోన్గా విశాఖ జోన్.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు
- సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఉత్తమ జోన్గా నిలిచిందన్న రైల్వే శాఖ
- ఏపీలో ప్రస్తుతం రూ. 54 వేల కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి
- మరో రూ.71 వేల కోట్ల ప్రాజెక్టులు పైప్లైన్లో ఉన్నాయన్న రైల్వే శాఖ
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అతిస్వల్ప కాలంలోనే రికార్డు స్థాయి పురోగతి సాధించి, వార్షికంగా రూ.2,493 కోట్ల రాబడితో దేశంలోనే అత్యుత్తమ జోన్గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రూ.54,000 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, మరో రూ.71,000 కోట్ల ప్రాజెక్టులు పైప్లైన్లో ఉన్నాయని పేర్కొంది. విశాఖ రైల్వే యార్డ్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లు కేటాయించామని, అందులో భాగంగా 6 కొత్త ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేసింది.
అలాగే గుంతకల్-బళ్లారి నాలుగు లైన్ల విస్తరణకు రూ.1,205 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. రైళ్ల భద్రత కోసం 100 ఇంజిన్లలో ‘కవచ్’ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపింది. ఏపీ వ్యాప్తంగా 300కు పైగా ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం, అమృత్ భారత్ కింద 70కి పైగా స్టేషన్ల అభివృద్ధి, విజయవాడలో స్లీపింగ్ పాడ్స్, రాబోయే గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లతో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను వేగంగా ఆధునీకరిస్తున్నట్లు వివరించింది.