వందేమాతరం బిల్లుకు లోక్ సభ ఆమోదం

Vandemataram Bill Passed
  • వందేమాతరం అవమానాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం
  • జాతీయ గీతంతో సమానంగా వందేమాతరానికి చట్టపరమైన రక్షణ
  • అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధించేలా కఠిన నిబంధనలు
  • ఉభయ సభల ఆమోదంతో రాష్ట్రపతి పరిశీలనకు చేరనున్న బిల్లు
జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే కీలక బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం ముద్ర వేసింది. జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026ను ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అంతకుముందు, జూలై 29న ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.

1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు చేపడుతుంది. ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం 'జన గణ మన'కు మాత్రమే ఉన్న చట్టపరమైన రక్షణ ఇకపై వందేమాతరం గేయానికి కూడా వర్తించనుంది. నూతన నిబంధనల ప్రకారం, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానానికి ఆటంకం కలిగించినా లేదా దానిని అవమానించినా గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. జాతీయ గీతంతో సమానంగా వందేమాతరానికి సమున్నత గౌరవం కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. సభలో చర్చ కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఇతర అంశాలపై పట్టుబడుతూ నిరసనలు వ్యక్తం చేయగా, వారు ప్రతిపాదించిన సవరణలను సభ తోసిపుచ్చింది. వందేమాతరం 150వ వార్షికోత్సవాల నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Vandemataram Bill
Lok Sabha Passed Vandemataram

More Telugu News