జెర్సీ మారినా దేశ ఆత్మ మారదు.. ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు

Priyanka Gandhi reacts to Indian hockey team saffron jersey controversy
  • భారత హాకీ కాషాయ జెర్సీపై వివాదం
  • స్పందించిన ప్రియాంక గాంధీ 
  • చరిత్రను మార్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయన్న ప్రియాంక
  • ఏం మార్చినా  దేశ యువత తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిందని వ్యాఖ్య 
  • ప్రజల ఆలోచనలను మార్చడం సాధ్యం కాదన్న కాంగ్రెస్‌ నేత
భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం జెర్సీ స్థానంలో ప్రపంచకప్‌ కోసం కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపై మొదలైన చర్చ రాజకీయ రంగు పులుముకుంది. మాజీ కెప్టెన్‌ విరేన్‌ రస్క్వీనా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా దీనిపై స్పందించారు. జెర్సీ మార్పు ఒక్కటే కాదని, చరిత్రను మార్చే ప్రయత్నాలు జరిగినా దేశ యువత తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ బయట మీడియాతో మాట్లాడిన ఆమె, దేశ ఆత్మను మాత్రం మార్చలేరని అన్నారు.

జెర్సీ మార్చినా, విద్యా విధానంలో చరిత్రను తిరగరాయాలని చూసినా ప్రజల ఆలోచనలను మార్చడం సాధ్యం కాదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌లో యువత వ్యక్తం చేసిన అభిప్రాయాలే దేశ స్వరమని చెప్పారు. భారత స్వాతంత్ర్య పోరాటం అహింస, సత్యం అనే విలువలపై నిర్మితమైందని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదని, ఈ విషయాన్ని దేశ ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిందని చెప్పారు.

సోదరభావం, ఐక్యత, సత్యం, అహింసలోనే దేశ ఆత్మ ఉందని ప్రియాంక స్పష్టం చేశారు. ద్వేషం రెచ్చగొట్టినా, హింసను ప్రోత్సహించినా భారత మూల విలువలను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని చెప్పారు. రాజకీయ భావజాలం పేరుతో దేశ స్వభావాన్ని మార్చడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన కొత్త జెర్సీపై భారత హాకీ మాజీ కెప్టెన్‌ విరేన్‌ రస్క్వీనా  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీ అంటే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది నీలం జెర్సీయేనని చెప్పారు. తాను ఎన్నో ఏళ్లు దాన్నే ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. అభిమానుల మనసుల్లో ఆ రంగుకే ప్రత్యేక స్థానం ఉందని, అలాంటప్పుడు కాషాయ రంగును ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

రస్క్వీనా వ్యాఖ్యల తర్వాత హాకీ ఇండియా కొత్త జెర్సీ రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించింది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీకగా ఎంచుకున్నట్లు తెలిపింది. భారత జాతీయ పతాకం, ఉదయించే సూర్యుడి స్ఫూర్తితో ఈ రంగును తీసుకున్నామని పేర్కొంది. అశోక చక్రాన్ని గుర్తు చేసే నేవీ బ్లూ అంచులు, మండల కళారూపాలు, సుదర్శన చక్రం స్ఫూర్తితో రూపొందించిన డిజైన్‌ భారత సంస్కృతి, ఐక్యత, పురోగతిని ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు అనుగుణంగానే ఈ జెర్సీని రూపొందించినట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది.
Advertisement
Priyanka Gandhi
Indian Hockey Jersey Controversy
Saffron Jersey World Cup
Viren Rasquinha
Hockey India New Jersey
Indian Hockey Team

More Telugu News