తెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరద... ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇవిగో!
- తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు
- జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో పాటు జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జలపాతాలు, నదీ తీర ప్రాంతాల వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వివిధ జలాశయాల ప్రస్తుత పరిస్థితి వివరాలు:
జూరాల ప్రాజెక్టు (మహబూబ్నగర్):
ఇన్ఫ్లో: 91,000 క్యూసెక్కులు. ఔట్ఫ్లో: 81,695 క్యూసెక్కులు (10 గేట్లు ఎత్తివేత).
నీటిమట్టం: గరిష్ఠంగా 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం 317.35 మీటర్లకు చేరింది.
నీటి నిల్వ: పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.371 టీఎంసీలు నమోదైంది. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి:
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 27.4 అడుగులకు చేరడంతో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (నిజామాబాద్):
ఇన్ఫ్లో: 6,250 క్యూసెక్కులు.
నీటిమట్టం: పూర్తిస్థాయి 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1065 అడుగులు ఉనంది. 80 టీఎంసీల సామర్థ్యానికి గాను 16 టీఎంసీల నిల్వ ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ (నిజామాబాద్):
ఇన్ఫ్లో: 3,935 క్యూసెక్కులు.
నీటిమట్టం: పూర్తిస్థాయి 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1395.83 అడుగులకు చేరింది. 17.802 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.146 టీఎంసీల నీరు నిల్వ ఉంది (గత ఏడాది ఇదే సమయానికి 4.622 టీఎంసీలుగా ఉంది).
సింగూరు ప్రాజెక్టు (సంగారెడ్డి):
ఇన్ఫ్లో: 517 క్యూసెక్కులు. ఔట్ఫ్లో: 470 క్యూసెక్కులు.
నీటి నిల్వ: 29.9 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 4.249 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.