చంద్రబాబును ఎదుర్కోలేక నన్ను లక్ష్యంగా చేసుకున్నారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari slams YSRCP for personal insults in AP Assembly
  • వైసీపీ నేతలపై భువనేశ్వరి తీవ్ర విమర్శలు
  • మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దని వ్యాఖ్య
  • అసెంబ్లీ ఘటనను గుర్తు చేసిన భువనేశ్వరి
  • ద్రౌపది ఉదాహరణతో పరోక్ష విమర్శలు
  • చంద్రబాబుకు ప్రజలే అండగా నిలిచారని వ్యాఖ్య
  • కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక తనను రాజకీయాల్లోకి లాగి వ్యక్తిగతంగా అవమానించారని ఆరోపించారు. ధైర్యం ఉంటే ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోవాలని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ద్రౌపది మాత ఆలయాన్ని బుధవారం సందర్శించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మహాభారతంలో కౌరవులు ద్రౌపది వస్త్రాపహరణకు పాల్పడి ధర్మరాజును అవమానించాలని చూశారని భువనేశ్వరి గుర్తు చేశారు. అదే తరహాలో అసెంబ్లీలో తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నించారని పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ధైర్యం ఉంటే మగాడు మగాడిలా నిలబడి ప్రత్యర్థిని ఎదుర్కోవాలని, మహిళలను రాజకీయాల్లోకి లాగడం సమంజసం కాదని అన్నారు.

ఓ మహిళ గురించి మాట్లాడే హక్కు ఏ పురుషుడికీ లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు. ప్రతి మహిళలకు వాళ్ల వ్యక్తిత్వం గురించి వాళ్ల మనసాక్షికే బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తనపై జరిగిన అవమానం జీవితాంతం మరిచిపోలేనని చెప్పారు. అది ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కావని, సందర్భం రావడంతో ప్రజల ముందుకు తీసుకొస్తున్న విషయమని వివరించారు.

నాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, నేడు చంద్రబాబుకు ప్రజలే దేవుళ్లుగా అండగా నిలిచారని భువనేశ్వరి భావోద్వేగంగా అన్నారు. ప్రజల మద్దతుతోనే ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోగలిగామని చెప్పారు. తనపై జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
Advertisement
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Andhra Pradesh Assembly
TDP
YSRCP
Kuppam

More Telugu News