ఈ వాహనాల్లో చిన్న మార్పులు అవసరం.. ఈ20 పెట్రోల్‌పై కేంద్రం కీలక ప్రకటన

Nitin Gadkari on E20 petrol and minor changes for old vehicles
  • 2016కు ముందు కొన్ని వాహనాల్లో స్వల్ప మార్పులు అవసరం కావచ్చన్న గడ్కరీ
  • బీఎస్‌-3 వాహనాల్లో రబ్బరు భాగాల మార్పు అవసరం ఉండొచ్చని వెల్లడి
  • సాధారణ సర్వీసింగ్‌లో వాటిని మార్చుకుంటే సరిపోతుందని వివరణ
  • ఇంజిన్లలో మార్పులు అవసరం లేదన్న అధ్యయనాలు
  • ఈ20తో ఇంజిన్ల పనితీరులో పెద్ద మార్పులు లేవని వెల్లడి
ఈ20 పెట్రోల్‌ తో వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూ వస్తున్న కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ20 వాడాలంటే 2016కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో మాత్రమే స్వల్ప మార్పులు అవసరమవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ముఖ్యంగా 2005 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన బీఎస్‌-3 ప్రమాణాల వాహనాల్లోని కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావచ్చని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. సాధారణ సర్వీసింగ్‌లోనే ఈ మార్పులు చేయవచ్చని స్పష్టం చేశారు.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌, ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన అధ్యయనాల్లో కార్లు, ద్విచక్ర వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని తేలిందని మంత్రి చెప్పారు. ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల పనితీరులో గణనీయమైన మార్పులు లేదా అసాధారణ అరుగుదల కనిపించలేదని వెల్లడించారు.

డ్రైవింగ్‌ సామర్థ్యం, స్టార్ట్‌ అయ్యే విధానం, లోహ భాగాలు, ప్లాస్టిక్‌ భాగాల పనితీరు వంటి అంశాల్లో కూడా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని గడ్కరీ తెలిపారు. ఈ20 పెట్రోల్‌ వాడటం వల్ల మైలేజ్‌ తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. వాహనం మైలేజ్‌ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఈ20 పెట్రోల్‌ను మాత్రమే కారణంగా చెప్పలేమని ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు, పరీక్షా సంస్థలు స్పష్టం చేసినట్లు వివరించారు.

2020లో నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన అంతర్‌శాఖ కమిటీ ఇథనాల్‌ మిశ్రమ ఇంధనంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఇంజిన్‌ పనితీరు, ఇంధన వ్యవస్థ, మన్నిక, కాలుష్య ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ20 పెట్రోల్‌ను దశలవారీగా అమలు చేశామని చెప్పారు. బ్రెజిల్‌ వంటి దేశాల్లో దశాబ్దాలుగా ఇంకా ఎక్కువ ఇథనాల్‌ మిశ్రమ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు.
Advertisement
Nitin Gadkari
E20 Petrol
Ethanol Blended Fuel
Old Vehicle Modifications
BS3 Vehicles
Indian Automobile Industry

More Telugu News