దేశీయ సీఫుడ్‌ ఎగుమతుల్లో విశాఖ పోర్టు హవా.. సగం ఇక్కడి నుంచే!

Visakhapatnam Port dominates domestic seafood exports with over half share
  • 2025లో విశాఖ పోర్టు నుంచి 50.87శాతం సముద్ర ఆహార ఎగుమతులు
  • 2026లోనూ 48.89శాతం వాటాతో ఆధిపత్యం
  • ఏడాదిలో 29.67 శాతం పెరుగుదల
  • పార్లమెంటులో గణాంకాలు వెల్లడించిన కేంద్రం
  • ఓడీఓపీ పథకంలో విశాఖ పోర్టు కీలక పాత్ర
  • ఏపీలో 26 జిల్లాల్లో 99 ఓడీఓపీ ఉత్పత్తులు
దేశ సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్నం పోర్టు ప్రధాన కేంద్రంగా అవతరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి జరిగిన సీఫుడ్‌ ఎగుమతుల్లో 50.87 శాతం వాటా ఒక్క విశాఖ పోర్టు ద్వారానే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. 2023-24లో ఈ వాటా 29.67 శాతంగా ఉండగా, ఏడాదిలోనే 21 శాతానికి పైగా పెరగడం విశేషం.

లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద ఈ వివరాలు వెల్లడించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం 7.38 బిలియన్‌ డాలర్ల సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేయగా, అందులో 2.19 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు విశాఖ పోర్టు ద్వారానే జరిగాయి. 2025లో విశాఖ పోర్టు వాటా 50.87 శాతానికి చేరగా, 2026లోనూ 48.89 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించింది.

విశాఖ పోర్టు దేశ సముద్ర ఆహార ఎగుమతులకు కీలక ద్వారంగా మారిందని కేంద్రం పేర్కొంది. ఒక జిల్లా - ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) పథకంలో భాగంగా ఈ పోర్టు కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ ప్రదర్శనలు, కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశాలు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో మొత్తం 99 ఓడీఓపీ ఉత్పత్తులను గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం, విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై రాష్ట్రం దృష్టి సారించిందని పేర్కొంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌ పోటీతత్వం మరింత బలపడుతోందని వివరించింది.
Advertisement
Visakhapatnam Port
Seafood exports India
MPEDA
One District One Product
Andhra Pradesh seafood
Marine products export

More Telugu News