Advertisement

ఆగస్టు నుంచి 'సంజీవని'.. సద్వినియోగం చేసుకోండి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu announces Sanjeevani health scheme launch from August
  • ఆగస్టు నుంచి ఏపీలో సంజీవని ఆరోగ్య పథకం అమలు
  • ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
  • వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ
  • గత ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని సీఎం విమర్శ
  • పరదాలు కట్టకుండా ప్రజల మధ్యకు వస్తున్నానన్న చంద్రబాబు
ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'సంజీవని' పథకాన్ని ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. "మీ ఆరోగ్యం.. మీ బాధ్యత" అని ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన, ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో నిర్వహించిన 'సంజీవని' కార్యక్రమం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ ప్రాజెక్టు విశిష్టతలను ప్రజలకు వివరించారు.

సంజీవని.. సమగ్ర ఆరోగ్య వ్యవస్థ
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. విద్య, వైద్యంపైనే ప్రతి కుటుంబం అధికంగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో, ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించేలా 'సంజీవని'ని తీర్చిదిద్దామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రతి పౌరునికి ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, కుటుంబ సభ్యులందరికీ హెల్త్ ఐడీలు జారీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు. 

కేవలం వ్యాధి వచ్చాక చికిత్స అందించడమే కాకుండా, వ్యాధులు రాకముందే గుర్తించడం (ప్రెడిక్టివ్), నివారణ చర్యలు చేపట్టడం (ప్రివెంటివ్), అవసరమైనప్పుడు నాణ్యమైన వైద్యం అందించడం (క్యూరేటివ్) అనే త్రిముఖ వ్యూహంతో సంజీవని పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని, ఈ పరిస్థితిని మార్చేందుకే ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని అన్నారు. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మాతా-శిశు సంరక్షణ, 108, 104 సేవలు, ఈ-ఔషధి వంటి అన్ని వ్యవస్థలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకొస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలీమెడిసిన్, రిమోట్ కేర్ వంటి సేవలను కూడా ఇందులో భాగం చేస్తామని తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
ప్రజారోగ్యంతో పాటు సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు, తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం-2.0 వంటి పథకాలతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల్లో సృష్టించిన గందరగోళాన్ని సరిదిద్దేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రీసర్వే చేపడుతున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి, రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వంపై విమర్శలు.. సాగునీటిపై హామీ
గత ఐదేళ్లలో గొడ్డలి పార్టీ నేతలు ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదని, ఒక్క పరిశ్రమ తేలేదని చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయని వారే ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వేదవతి ప్రాజెక్టును రూ.1,768 కోట్లతో పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని తెలిపారు.

ప్రజల మధ్య ఉండే కామన్ మ్యాన్‌ను
సభ అనంతరం అదే వేదికపై నుంచి ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాను గత పాలకుల్లా పరదాలు కట్టుకుని, చెట్లు నరికించి సభలు పెట్టడం లేదని, ప్రజల మధ్యకు నేరుగా వస్తున్నానని అన్నారు. సీఎం అంటే సచివాలయంలో కూర్చునే చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదని, ప్రజల మధ్య ఉండే కామన్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును సీఎం అందజేశారు.
Advertisement
Chandrababu Naidu
Sanjeevani Health Scheme
Andhra Pradesh Healthcare
Digital Health Profile
AP Welfare Schemes
Rayalaseema Development

More Telugu News