Advertisement

ముస్లిం కుటుంబాలు ఇళ్ల కొనుగోలుపై వివాదం.. ముజఫర్‌నగర్‌లో ఉద్రిక్తత

Muzaffarnagar tension over Muslim families buying houses in Janakpuri colony
  • ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని జనక్‌పురి కాలనీలో ఘటన
  • ముస్లిం కుటుంబాలు  ఇళ్లు కొనడంపై చెలరేగిన వివాదం
  • వారి  ఇళ్ల ముందు హనుమాన్ చాలీసా పఠిస్తూ హిందూ సంఘాల నిరసన
  • పీఎంఏవై కింద నిర్మించిన రెండు ఇళ్లను సీల్ చేసిన జిల్లా యంత్రాంగం
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా జనకపురి కాలనీలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులు అత్యధికంగా నివసించే ఈ కాలనీలో కొందరు ముస్లిం కుటుంబాలు ఇళ్లను కొనుగోలు చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందూ సంఘర్ష్ సమితికి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో ఆ ఇళ్ల వద్దకు చేరుకుని, బయట కూర్చుని హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో జనాభా నిష్పత్తిని మార్చడానికి నిబంధనలకు విరుద్ధంగా ఆస్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనివల్ల స్థానిక సామాజిక వాతావరణం దెబ్బతింటోందని వారు ఆరోపించారు. ముస్లిం కుటుంబాలు అక్కడి నుంచి వెళ్లే వరకు ప్రతి వారం హనుమాన్ చాలీసా పఠనం కొనసాగిస్తామని సమితి కన్వీనర్ నరేంద్ర పవార్ స్పష్టం చేశారు.

ఈ నిరసనల సమాచారం అందుకోగానే పోలీస్, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ప్రాథమిక విచారణలో భాగంగా అధికారులు సదరు కాలనీలో ముస్లిం కుటుంబాలు కొనుగోలు చేసిన ఆరు ఇళ్లను పరిశీలించారు. అందులో నాలుగు ఇళ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన 'ప్రధాని ఆవాస్ యోజన' (పీఎంఏవై) పథకం కిందకు వస్తాయని గుర్తించారు. ప్రభుత్వ పథకాల నిబంధనల ప్రకారం ఇటువంటి ఇళ్ల విక్రయాలు చెల్లవనే కారణంతో యంత్రాంగం తక్షణమే ఆ రెండు ఇళ్లను సీల్ చేసి, అందులో ఉన్న కుటుంబాలను బయటకు పంపించివేసింది. మిగిలిన ఇళ్ల చట్టబద్ధతపై కూడా అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.

ఈ చర్యలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము సుమారు రూ. 23.25 లక్షలు వెచ్చించి చట్టబద్ధంగానే స్థానిక యజమాని నుంచి ఇల్లు కొనుగోలు చేశామని, ఇది ప్రభుత్వ పథకం కింద నిర్మించిన ఇల్లు అనే విషయం విక్రేత తమకు చెప్పలేదని వ్యాపారి మహమ్మద్ అజీమ్ తెలిపారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా ఇల్లు సీల్ చేయడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా పోలీసు బలగాలను మోహరించామని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ మిశ్రా వెల్లడించారు. బాధితులు, నిరసనకారుల ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతున్నామని, చట్ట నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Advertisement
Muzaffarnagar
Pradhan Mantri Awas Yojana
Hindu Sangharsh Samiti
Janakpuri colony tension
Uttar Pradesh property dispute
Hanuman Chalisa protest

More Telugu News