నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాల్లో మళ్లీ కలకలం.. రెండు గంటల్లోనే 540 నుంచి 167కు పడిపోయిన మార్కులు!

NEET Re exam Results Controversy Marks Dropped From 540 To 167 In Two Hours
  • ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కుమార్తెకు నీట్ షాక్
  • ఎన్టీఏ వెబ్‌సైట్‌లో ఘోరమైన తప్పులు
  • ఓఎంఆర్ షీట్ మార్కులకు, రిజల్ట్స్‌కు లేని పొంతన 
  • న్యాయం జరగకపోతే పీఎంవోకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక 
  • ఆ ఓఎంఆర్ షీట్లు నకిలీవని కొట్టిపారేసిన ఎన్టీఏ 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాల విడుదల తర్వాత సరికొత్త వివాదం రాజుకుంది. ఫలితాల ప్రకటనలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని, తమకు రావాల్సిన మార్కుల కంటే పోర్టల్‌లో చాలా తక్కువ మార్కులు చూపిస్తున్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాన్పూర్‌కు చెందిన ఆర్య సింగ్, అయోధ్యకు చెందిన ఆరుషి పటేల్ అనే విద్యార్థినులు తమ మార్కులు విపరీతంగా తగ్గిపోయాయంటూ సాక్ష్యాధారాలతో రంగంలోకి దిగడంతో ఈ పరీక్షల పారదర్శకతపై మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కాన్పూర్‌కు చెందిన ఆర్య సింగ్ ప్రకారం.. జులై 13న ఎన్టీఏ అప్‌లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్‌ను బట్టి తనకు 609 మార్కులు రావాల్సి ఉంది. అయితే అందులో ప్రశ్నల క్రమం తప్పుగా ఉండటంతో ఆమె ఛాలెంజ్ పోర్టల్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఎన్టీఏ సవరించిన ఓఎంఆర్ షీట్ పెట్టినప్పటికీ అందులో మార్కులు తప్పుగానే చూపించారు. 

జులై 16న అర్ధరాత్రి ఫలితాలు విడుదలైనప్పుడు ఆర్య సింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడగా మొదట 540 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెబ్‌సైట్‌ను రీఫ్రెష్ చేస్తూ ఉండగా.. తెల్లవారుజామున 2 గంటల సమయానికి ఆ స్కోరు ఒక్కసారిగా 167 మార్కులకు పడిపోయింది. ప్రస్తుతం పోర్టల్‌లో 167 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 12,52,036 గా చూపిస్తోంది.

దీనిని తీవ్రమైన సాంకేతిక లోపంగా లేదా మూల్యాంకన తప్పుగా పరిగణిస్తూ ఆర్య సింగ్ ఇప్పటికే జాతీయ పరీక్షల సంస్థ, విద్యా మంత్రిత్వ శాఖకు స్క్రీన్‌షాట్లు, ఓఎంఆర్ షీట్ ఆధారాలతో ఫిర్యాదు చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి కార్యాలయాలను ఆశ్రయిస్తానని ఆమె స్పష్టం చేసింది. 2025 నీట్ ప్రయత్నంలో కూడా తనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని, కానీ అప్పట్లో ఆధారాలు లేకపోవడం వల్ల పోరాడలేకపోయానని, ఈసారి మాత్రం అన్ని రికార్డులను భద్రపరుచుకున్నానని తెలిపింది. ఆర్య సింగ్ తండ్రి రాకేష్ సింగ్ రాజ్ పుతానా రైఫిల్స్‌లో 24 ఏళ్ల పాటు సైనికుడిగా సేవలు అందించి రిటైర్ అయ్యారు.

మరోవైపు అయోధ్యకు చెందిన ఆరుషి పటేల్ కూడా ఫలితాలు విడుదలైన మరుసటి రోజున తన మార్కులు తగ్గిపోయాయని ఆరోపించింది. ఈ వరుస ఫిర్యాదులపై ఎన్టీఏ స్పందిస్తూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చలామణి అవుతున్న కొన్ని ఓఎంఆర్ షీట్లు డిజిటల్‌గా మార్పు చేసినవి లేదా ఏఐ ద్వారా సృష్టించినవని తెలిపింది. తప్పుడు పత్రాలను సమర్పించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే, ఆర్య సింగ్ మార్కులు రెండు గంటల్లోనే 540 నుండి 167కు ఎందుకు పడిపోయాయనే నిర్దిష్ట ఆరోపణలపై ఎన్టీఏ ఇంకా బహిరంగంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.  
Advertisement
Arya Singh
NEET UG Re-exam Results
NTA Controversy
NEET Marks Discrepancy
NEET OMR Sheet Issue
National Testing Agency

More Telugu News