తెలంగాణలో క్యూఆర్ కోడ్‌తో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Telangana new smart ration cards with QR code and three months rice distribution at once
  • వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్డుల‌ పంపిణీ కార్యక్రమం 
  • క్యూఆర్ కోడ్‌తో పటిష్ఠ‌ భద్రతా ఫీచర్లతో కొత్త కార్డుల రూపకల్పన
  • ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
  • రేషన్ సరుకులకు జులై 31 లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి
తెలంగాణలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం వినియోగిస్తున్న కాగితపు కార్డుల స్థానంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. వారం రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీవీసీ స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం లబ్ధిదారులు వాడుతున్న ఏ4 సైజు కాగితపు కార్డులు త్వరగా చిరిగిపోవడం, పాడైపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అందించే స్మార్ట్ కార్డులపై లబ్ధిదారుడి వివరాలతో పాటు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్, ఆహార భద్రతా కార్డు నంబర్‌ను ముద్రించారు. భద్రతా ఫీచర్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు కూడా ఉంటాయి. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత వస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

రాజధానిలో సీఎం కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేయనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం పౌరసరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.

ఒకేసారి మూడు నెలల బియ్యం
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పేదలకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి. లబ్ధిదారులు మూడుసార్లు వేలిముద్రలు వేసి తమ కోటాను పొందవచ్చు.

అయితే, ఈసారి రేషన్ సరుకులు పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు జులై 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తమకు దగ్గరలోని రేషన్ దుకాణంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచించారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోని వారికి రేషన్ సరుకులు అందవని స్పష్టం చేశారు.
Advertisement
Telangana Government
Smart Ration Cards
Revanth Reddy
QR Code Ration Card
Telangana Ration Rice
e-KYC Update

More Telugu News