ఓడలరేవు బీచ్‌లో విషాదం: సముద్రంలో మునిగి ముగ్గురు యువకుల మృతి

Tragedy at Odalarevu Beach Three youths drown in the sea
  • కోనసీమ ఓడలరేవు బీచ్‌లో తీవ్ర విషాదం
  • సముద్ర స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు
  • తొలుత ఇద్దరి మృతదేహాలు లభ్యం
  • ఆ తర్వాత మరో యువకుడి మృతదేహం లభ్యం
  • సెలవులకు ఊరికొచ్చి ప్రాణాలు కోల్పోయిన యువత
కోనసీమ జిల్లాలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు అలల ఉద్ధృతికి గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

వివరాల్లోకి వెళితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఆదివారం పిక్నిక్‌ కోసం ఓడలరేవు బీచ్‌కు వెళ్లారు. వీరిలో అరవింద్ (23), శ్రీరామ్ (17), మంచిల సాయి సముద్రంలో స్నానానికి దిగారు. అయితే, అలల తాకిడికి వారు అదుపుతప్పి సముద్రంలో కొట్టుకుపోయారు.

దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల సహాయంతో గాలించగా, అరవింద్, శ్రీరామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో యువకుడు సాయి మృతదేహాన్ని కూడా వెలికితీశారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తం ఉంటూ ఇటీవలే సెలవులపై సొంత గ్రామానికి వచ్చిన యువకులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు యువకులు మృతి చెందడంతో మాచవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సముద్ర తీరంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement
Odalarevu Beach
Konaseema district
Drowning accident
Three youths dead
Machavaram village
Sea tragedy

More Telugu News