ఈ-రిక్షాలను రోడ్డుపైనే ఆపేస్తున్న చైనా యాప్.. వైరల్ ట్రెండ్పై ఆందోళన!
- బీఏటీ-బీఎంఎస్ యాప్తో ఈ-రిక్షాలను రిమోట్గా ఆపేస్తున్న వైరల్ ట్రెండ్
- బ్లూటూత్ ద్వారా బ్యాటరీ సిస్టమ్కు కనెక్ట్ అయి వాహనం నిలిపివేత
- భద్రతా లోపాలున్న చైనా బీఎంఎస్లను దుర్వినియోగం చేస్తున్న యువకులు
- రోడ్డు ప్రమాదాలు, డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ఆందోళన
- వైరల్ ట్రెండ్ను అరికట్టాలని నెటిజన్ల డిమాండ్
వైరల్ వీడియోల్లో చూపిస్తున్న ప్రకారం.. కొందరు యువకులు బీఏటీ-బీఎంఎస్ యాప్ ద్వారా బ్లూటూత్ సాయంతో ఈ-రిక్షా ‘బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్’(బీఎంఎస్)కు కనెక్ట్ అవుతున్నారు. అనంతరం ‘డిశ్చార్జ్’ స్విచ్ను ఆఫ్ చేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోతోంది. భారతదేశంలో తక్కువ ధరలో లభించే అనేక ఈ-రిక్షాలు, ఈ-స్కూటర్లలో చైనా తయారీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్లు ఉండటం, వాటిలో భద్రతా ఫీచర్లు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పాస్వర్డ్ లేకుండానే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.
బీఏటీ-బీఎంఎస్ అనేది వాస్తవానికి బ్యాటరీ పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించిన అధికారిక యాప్. బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను రియల్టైమ్లో చూపించడంతో పాటు, బ్యాటరీని రిమోట్గా నియంత్రించే సౌకర్యం కూడా ఇందులో ఉంది. అయితే ప్రస్తుతం అదే ఫీచర్ను కొందరు ఈ-రిక్షాలను నిలిపివేయడానికి వినియోగిస్తున్నారు. ఈ యాప్ ఐఓఎస్ యాప్ స్టోర్లో అందుబాటులో లేదు. గూగుల్ ప్లే స్టోర్లో ఇంకా ఉన్నట్లు సమాచారం.
ఈ ట్రెండ్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుమధ్యలో వాహనం ఆగిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్ల జీవనోపాధితో ఆటలాడొద్దని పలువురు హెచ్చరిస్తున్నారు. సరదాగా మొదలైన ఈ ట్రెండ్ భవిష్యత్తులో ప్రజా భద్రతకు పెద్ద ముప్పుగా మారొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.