నాకు ప్రాణ హాని ఉంది.. కస్టడీకి ఇవ్వొద్దు: సీఐ నాగరాజు
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో రిమాండ్ లో ఉన్న నాగరాజు
- తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇప్పటికే అధికారులకు చెప్పానని వెల్లడి
- తనను కస్టడీకి ఇస్తే ప్రాణహాని ఉందన్న నాగరాజు
"నా ప్రాణాలకు ముప్పు ఉంది.. కేసు ఒప్పుకోవాలంటూ నాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు" అంటూ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు న్యాయమూర్తి ముందే సంచలన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారం రేపిన ఈ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చిన ఆయన, తన గోడును వెళ్లబోసుకున్నారు.
ఈ కేసులో తనను అకారణంగా ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని, బలవంతంగా నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని నాగరాజు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన విచారణకు తాను పూర్తిగా సహకరించానని, తన దగ్గరున్న సమాచారమంతా ఇప్పటికే అధికారులకు ఇచ్చేశానని చెప్పారు. ఇప్పుడు తన వద్ద అదనంగా చెప్పడానికి ఎలాంటి సమాచారం లేదని, పైగా పోలీస్ కస్టడీకి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సస్పెండెడ్ సీఐ నాగరాజు చేసిన ఈ ప్రాణభయం ఆరోపణలను న్యాయస్థానం సీరియస్గా తీసుకుంది. ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు, ఆరోపణలపై పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా తమకు సమర్పించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు, ఈ లాకప్ డెత్ కేసులో అసలు నిజాలను బయటకు తీసేందుకు సిట్ అధికారులు నాగరాజును 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు