అప్పటివరకు వైభవ్ సూర్యవంశీకి వెయిటింగ్ తప్పకపోవచ్చు: పుజారా
- యువ సంచలనం వైభవ్కు భారత మాజీ క్రికెటర్ పుజారా కీలక సూచనలు
- ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో అతనికి వెంటనే అవకాశం రాకపోవచ్చని వ్యాఖ్య
- తొలి మూడు మ్యాచ్ల వరకు వైభవ్ వేచి ఉండాల్సి రావచ్చన్న మాజీ క్రికెటర్
- తన చుట్టూ ఉన్న హైప్ను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని హితవు
- అవకాశం వచ్చినప్పుడు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని సలహా
ఈ పర్యటనకు ముందు పుజారా మాట్లాడుతూ.. "ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ చుట్టూ చాలా హైప్ ఉంది. ఒక యువ ఆటగాడిగా, తన గురించి బయట వస్తున్న మాటలను అస్సలు పట్టించుకోకూడదు. బయటి ప్రపంచం నుంచి వచ్చే శబ్దాలను పక్కనపెట్టి, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టాలి" అని సూచించాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.
జట్టు ఎంపిక గురించి పుజారా మాట్లాడుతూ.. "వైభవ్ మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ, జట్టులోకి ఎంపికవ్వడం వేరే విషయం. ఇంగ్లండ్ సిరీస్లో అతనికి వెంటనే అవకాశం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే భారత జట్టు తమ టాప్-3ని మార్చడానికి ఇష్టపడదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి నాణ్యమైన బ్యాటర్లు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి తొలి మూడు మ్యాచ్ల వరకు వైభవ్ వేచి ఉండాల్సి రావచ్చు" అని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్నంత మాత్రాన జట్టులో చోటు దక్కుతుందని చెప్పలేమని, సరైన సమయం కోసం ఎదురుచూడాలని అన్నాడు.
ఒకవేళ అవకాశం వస్తే ఎలా ఆడాలో కూడా పుజారా వివరించాడు. "అవకాశం వచ్చినప్పుడు అతను ప్రశాంతంగా, నిలకడగా ఉండటమే కీలకం. భారీ స్కోర్లు చేయాలనే ఒత్తిడిని తనపై తాను పెట్టుకోకూడదు. మైదానంలోకి వెళ్లి ఎలాంటి బెరుకు లేకుండా స్వేచ్ఛగా తన ఆటను తాను ఆడాలి" అని సలహా ఇచ్చాడు.
అలాగే, ఇంగ్లండ్లోని పరిస్థితులు భిన్నంగా ఉంటాయని పుజారా హెచ్చరించాడు. "ఐపీఎల్లో అతను కనబరిచిన ప్రదర్శనను ఇంగ్లండ్ పరిస్థితుల్లో పునరావృతం చేయడం అంత సులభం కాదు. అందుకే అతను బాగా సిద్ధమవ్వాలి, అక్కడి వాతావరణానికి, పిచ్లకు అలవాటు పడాలి. ఒకసారి అవగాహన పెంచుకున్నాక, బంతిని చూసి దానికి తగ్గట్టు ఆడటమే ముఖ్యం. మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి" అని పుజారా పేర్కొన్నాడు.