మంత్రి శ్రీధర్ బాబు దంపతుల మార్ఫింగ్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు
- శ్రీధర్ బాబు, ఆయన భార్య శైలజా రామయ్యర్ ఫేక్ వీడియోను పోస్ట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది శశిభూషణ్
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ దంపతులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక మార్ఫింగ్ వీడియో కలకలం రేపుతోంది. వారిద్దరిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (డీప్ ఫేక్)తో క్రియేట్ చేసిన అభ్యంతరకర మార్ఫింగ్ వీడియో ఫేస్బుక్లో ప్రత్యక్షమవ్వడం దుమారం రేపుతోంది.
శ్రీధర్ బాబు దంపతుల వ్యక్తిగత, వృత్తిపరమైన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే పక్కా స్కెచ్తో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఈ అభ్యంతరకర మార్ఫింగ్ వీడియోలను పోస్టు చేశారు. ఈ వీడియోలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాది శశిభూషణ్ ఫిర్యాదు చేశారు. సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదాల్లో ఉన్న ఒక మంత్రి, ఒక ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠను బజారున పడేసేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తులను గుర్తించి ఐటీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.