హర్మూజ్ సంక్షోభంలో భారత్ విజయం.. టోల్ చెల్లించకుండా 12 నౌకలు ఇండియాకు
- హర్మూజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం
- ఆ సమయంలో కేంద్ర తీసుకున్న చర్యలను వివరించిన హర్దీప్ సింగ్ పురీ
- పలు దేశాల నుంచి ముడి చమురు తెప్పించామని వెల్లడి
- దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని కూడా పెంచామన్న మంత్రి
- ఈ చర్యల వల్లే వినియోగదారులపై ప్రభావం పడలేదని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని పురీ పేర్కొన్నారు. ముడిచమురు దిగుమతులను ఒక్క దేశానికే పరిమితం చేయకుండా పలు దేశాల నుంచి తెప్పించామని చెప్పారు. దీంతో దేశంలో వంటగ్యాస్, ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడలేదన్నారు.
సంక్షోభ సమయంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని కూడా భారీగా పెంచామని వివరించారు. ఇంతకుముందు వంటగ్యాస్ ఉత్పత్తి చేయని రిఫైనరీలను కొద్ది రోజుల్లోనే మార్పులు చేసి ఎల్పీజీ తయారీకి సిద్ధం చేశామని చెప్పారు. దీంతో రోజుకు 35 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న ఉత్పత్తిని 54 వేల మెట్రిక్ టన్నులకు పెంచగలిగామని తెలిపారు.
వంటగ్యాస్ కొరత రాకుండా అల్జీరియా, జపాన్, కెనడా వంటి దేశాలతో కొత్త సరఫరా ఒప్పందాలు కుదుర్చుకున్నామని పురీ చెప్పారు. అమెరికా నుంచి అదనపు ఎల్పీజీ కార్గోలను కూడా తెప్పించామని వెల్లడించారు. దీంతో దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చగలిగామని అన్నారు.
ఇంధన ధరల భారం తగ్గించేందుకు కేంద్రం లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. అలాగే బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు వంటగ్యాస్ పంపిణీలో డిజిటల్ అథెంటికేషన్ విధానాన్ని తప్పనిసరి చేశామని చెప్పారు. ఈ చర్యల వల్ల ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావం భారత వినియోగదారులపై పడకుండా కాపాడగలిగామని హర్దీప్ పేర్కొన్నారు.