'జై భీమ్' కాంబో రిపీట్.. కేజీఎఫ్ నిర్మాతలతో సూర్య కొత్త సినిమా
- 'జై భీమ్' తర్వాత సూర్య, దర్శకుడు జ్ఞానవేల్ కలయిక
- హోంబలే ఫిల్మ్స్ తో తొలిసారి సూర్య
- చెన్నైలో ఘనంగా ప్రారంభమైన కొత్త చిత్రం
- హీరోయిన్గా కయాదు లోహర్ ఎంపిక
ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్గా కయాదు లోహర్ నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రాఫర్గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్గా పనిచేయనున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన ఒక పవర్ఫుల్, గ్రిట్టి డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇటీవలే రజనీకాంత్తో 'వెట్టైయాన్' సినిమాను తెరకెక్కించిన జ్ఞానవేల్, వెంటనే సూర్యతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్, సూర్య మూడు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని, సినిమాల ఎంపికలో ఆయన నిర్భయ వైఖరిని ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే శక్తివంతమైన, అర్థవంతమైన కథలను అందించాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని నిర్మాత విజయ్ కిరగందూర్ పేర్కొన్నారు. ఇటీవలే 'కరుప్పు' చిత్రంతో విజయం అందుకున్న సూర్య, ఈ కొత్త ప్రాజెక్టుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు.
కాగా, ఈ సినిమాపై హోంబలే ఫిల్మ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది
సూర్యతో మా ప్రయాణం.. గర్వంగా ఉంది: హోంబలే ఫిల్మ్స్
"ఇది ఆయన నిర్మించుకున్న కెరీర్. ఫ్రేమ్ ఫ్రేమ్కూ, సినిమా సినిమాకూ, ఫైట్ ఫైట్కూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. ఎన్నో నిజ జీవితాల బరువును మోసే పాత్రలలో జీవించారు. ఆయన కెరీర్ ప్రతీసారీ సౌకర్యాన్ని కాదని, ధైర్యాన్ని ఎంచుకుంది. మూడు దశాబ్దాలుగా తెరపై సత్యాన్ని ఆవిష్కరిస్తూ, తెర వెనుక కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు.
ఈ తరం అత్యంత నిర్భయ నటుడు, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత భారీ వేదికపైకి అడుగుపెడుతున్నారు. అలాంటి నటుడితో సినిమా చేసే అవకాశం మాకు దక్కింది. హోంబలే ఫిల్మ్స్ తరఫున 'ది వన్ - సూర్య'కు మేము గర్వంగా స్వాగతం పలుకుతున్నాము.
సూర్య గారితో మా ఈ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఆయన నటన, మా నిర్మాణ విలువలు కలిసి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.