ఉద్ధవ్తో ఫడ్నవీస్ విమాన ప్రయాణం.. ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే!
- ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించడంపై స్పందించిన షిండే
- కుట్రపూరిత స్నేహితుడితో ప్రమాదం ఏంటో ఫడ్నవీస్కు తెలుసంటూ పరోక్ష వ్యాఖ్యలు
- 2019లో ఉద్ధవ్ తమను వీడి కాంగ్రెస్తో జతకట్టారని గుర్తు చేసిన షిండే
- తమ మధ్య ఉన్నత స్థాయి చర్చ జరిగిందని ఉద్ధవ్ చెప్పడంతో పెరిగిన ఆసక్తి
- ఉద్ధవ్ను ఇంటి నుంచి బయటకు రప్పించింది తానేనని షిండే వ్యాఖ్య
ముంబై నుంచి నాగ్పూర్కు వెళ్లే విమానంలో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి ప్రయాణించారు. ఈ ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు షిండే పైవిధంగా స్పందించారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, అప్పటి శివసేన ఒకే విమానంలో ఉన్నాయని, కానీ అప్పుడు ఉద్ధవ్ వేరే విమానం ఎక్కి కాంగ్రెస్తో చేతులు కలిపారని ఆయన గుర్తుచేశారు. ఆనాటి రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ఉద్ధవ్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
మరోవైపు ఫడ్నవీస్తో విమాన ప్రయాణం గురించి ఉద్ధవ్ ఠాక్రేను అడగ్గా.. తమ మధ్య 'అత్యున్నత స్థాయిలో చర్చలు' జరిగాయని ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. దాని ఫలితం రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పడంతో రాజకీయంగా చర్చ మరింత ఊపందుకుంది. అయితే, ఈ ప్రయాణానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, పార్టీలకు అతీతంగా నేతల మధ్య వ్యక్తిగత స్నేహ సంబంధాలు ఉంటాయని బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి.
ఇదిలా ఉంటే.. తన వర్గం నుంచి ఆరుగురు ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో ఉద్ధవ్ ఠాక్రే పర్యటించడాన్ని కూడా షిండే ప్రస్తావించారు. ఉద్ధవ్ను ఇంటి నుంచి బయటకు రప్పించి, ప్రజల్లోకి వచ్చేలా చేసింది తానేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.