ఏపీ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్.. రిటైర్మెంట్కు ముందు పోస్టింగ్ అందుకేనా?
- పదవీ విరమణకు నాలుగు రోజుల ముందు ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్
- స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలక్ష్మికి ఊరట
- కక్ష సాధింపులు ఉండవనే సంకేతాలు పంపిన ప్రభుత్వం
- గౌరవప్రదమైన పదవీ విరమణకు అవకాశం కల్పించిన సర్కార్
అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం ఒక అధికారి సస్పెన్షన్లో లేనప్పుడు, పదవీ విరమణకు ముందు వారికి ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా పంపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పాటిస్తూ ప్రభుత్వం శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చింది. తద్వారా తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ నిర్ణయం అధికార వర్గాల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథాన్ని పెంచే అవకాశం ఉంది.
పోస్టింగ్తో రిటైర్ అవడం ఎందుకు ముఖ్యం?
ఒక అధికారి పదవిలో ఉండి రిటైర్ అవడానికి, పోస్టింగ్ లేకుండా రిటైర్ కావడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పదవిలో ఉండి రిటైర్ అయితే, పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలు, పెన్షన్, నో-డ్యూ సర్టిఫికెట్లు పొందడం సులభతరం అవుతుంది. అదే పోస్టింగ్ లేకుండా రిటైర్ అయితే, ఆర్థికంగా పెద్ద నష్టం లేకపోయినా ఈ పత్రాల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది అధికారికి వృత్తిపరంగా అవమానకరంగా ఉంటుంది.
ఒకవేళ అధికారిపై తీవ్రమైన అవినీతి లేదా క్రిమినల్ ఆరోపణలు ఉండి, సస్పెన్షన్లో ఉండగా రిటైర్ అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. వారికి పూర్తి స్థాయి పెన్షన్ లభించదు, కేవలం తాత్కాలిక పెన్షన్ మాత్రమే అందుతుంది. శాఖాపరమైన విచారణ లేదా కోర్టు తీర్పులో నిర్దోషిగా తేలేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
గతంలో కూడా పలువురు సీనియర్ అధికారులు పదవీ విరమణకు ముందు పోస్టింగ్ల కోసం న్యాయపోరాటాలు చేసిన సందర్భాలున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సైతం పదవీ విరమణకు ఒక రోజు ముందు పోస్టింగ్ పొందారు. అయితే, దాని కోసం ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్లు కేఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య వంటి వారికి కూడా గతంలో పదవీ విరమణకు ముందు పోస్టింగ్లు లభించాయి.
మొత్తం మీద శ్రీలక్ష్మి విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. సర్వీస్ నిబంధనలను గౌరవించడమే కాకుండా అధికారులలో నూతన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచేదిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.