హైదరాబాద్లో ఓ ఏటీఎంలో.. డ్రా చేసిన దానికన్నా రూ.2200 అధికంగా క్యాష్!
- హైదరాబాద్లోని షాహీన్నగర్ ఏటీఎంలో సాంకేతిక లోపం
- ఎక్కువ నగదు రావడంపై పోలీసులకు సమాచారమిచ్చిన కస్టమర్
- ఏటీఎంను తాత్కాలికంగా మూసివేసి దర్యాప్తు ప్రారంభం
షాహీన్నగర్లోని హైవే హోటల్ సమీపంలో ఉన్న హిటాచీ ఏటీఎంలో ఓ వినియోగదారుడు నగదు డ్రా చేశాడు. అయితే, తాను కోరిన మొత్తం కంటే సుమారు రూ. 2,200 అదనంగా రావడంతో అతను విస్తుపోయాడు. వెంటనే ఈ విషయాన్ని బాలాపూర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇతర వినియోగదారులు డబ్బులు ఉపసంహరించుకోకుండా ఏటీఎంను తాత్కాలికంగా మూసివేయించారు.
యంత్రంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ విధంగా అదనపు నగదు వచ్చి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎం లావాదేవీల వివరాలను, మెషిన్ పనితీరును అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు నగదు నష్టపోయినట్లు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, దర్యాప్తు పూర్తయ్యాక వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. కాగా, వినియోగదారుడి నిజాయితీని పలువురు ప్రశంసిస్తున్నారు.