లంచం కేసులో చిక్కిన తహసీల్దార్.. రూ. 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!
- లంచం కేసులో పట్టుబడ్డ షామీర్పేట తహసీల్దార్ సుచరితపై మరో కేసు
- ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ
- సోదాల్లో రూ. 5.05 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన అధికారులు
- నెల క్రితం రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సుచరిత
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలంలో తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జాయింట్ సబ్-రిజిస్ట్రార్గా పనిచేసిన సుచరిత, ఆమె డ్రైవర్ వి. నగేష్ను మే 26, 2026న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. 30 ఎకరాల వ్యవసాయ భూమికి నాలా (NOC) మార్పిడి కోసం ఒక వ్యక్తి నుంచి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ. 2 లక్షలు ముడుపులు తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో అవినీతి ద్వారా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై జూన్ 25న సుచరితపై ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. ఆమె నివాసంతో పాటు ఇతర మూడు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 12 లక్షల నగదు, రూ. 1.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి.
వీటితో పాటు బ్యాంకు ఖాతాల్లో రూ. 38 లక్షలు, ఒక వోక్స్వ్యాగన్, ఒక హ్యుందాయ్ క్రెటా కార్లు, హైదరాబాద్లో మూడు ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ గ్రామాల్లో రెండు ప్లాట్లు, సిద్దిపేట జిల్లా దమ్మరకుంట గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ సుమారు 5.05 కోట్లు రూపాయలుగా ఉంటుంది.
లంచం కేసు తర్వాత సస్పెన్షన్కు గురైన సుచరితపై తాజాగా నమోదైన అక్రమాస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.