ట్యాంకర్‌పై అమెరికా దాడి.. మృతుల్లో విశాఖ నావికుడు పట్నాల సురేష్

US attack on tanker Vizag sailor among dead
  • ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి
  • దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి, 21 మందికి గాయాలు
  • మృతుల్లో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్
  • త్వరలో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా విషాదం
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఉండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించడమే కాకుండా, అమెరికా ప్రభుత్వానికి తన నిరసనను బలంగా తెలియజేసింది.

జూన్ 10న 'ఎంటీ సెటెబెల్లో' అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్‌) దాడి చేసింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ చమురు రవాణా చేస్తున్నారని, తమ ఆదేశాలను పాటించకపోవడంతోనే నౌకలోని ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడి ప్రభావంతో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ (44), డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఫిట్టర్ శివానంద్ చౌరాసియా మరణించారు. సురేష్‌కు భార్య భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరికొద్ది రోజుల్లో తన 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. 

తన భర్త శాశ్వతంగా దూరం కావడంతో భార్య భార్గవి కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఐదు నెలలుగా విధుల్లో ఉన్న సురేశ్ త్వరలోనే ఇంటికి రావాల్సి ఉందని, ఇందుకోసం ఆయన ఇప్పటికే అనుమతి కూడా పొందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Patnala Suresh
US attack oil tanker
MT Settebello
Visakhapatnam sailor death
Gulf of Oman

More Telugu News