టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?
- లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్లో చీలిక
- 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు జెండా
- ఎన్డీయేకు మద్దతివ్వాలని యోచిస్తున్న రెబల్ వర్గం
- ఫిరాయింపుల నిరోధక చట్టంపై కొనసాగుతున్న చర్చ
- స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
సీనియర్ నాయకురాలు, నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలీ ఘోష్ దస్తీదార్ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత భూపేందర్ యాదవ్ నివాసంలో ఈ రెబల్ ఎంపీలు సమావేశమైనట్లు తెలుస్తోంది. తమను ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని కోరుతూ త్వరలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలవాలని వారు నిర్ణయించుకున్నారు.
అయితే, ఈ ఎంపీల భవిష్యత్తు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) పరిధిలో ఉండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. చట్టం ప్రకారం అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే, పార్టీలోని మొత్తం సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మంది విడిపోవాల్సి ఉంటుంది. టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీలలో ఈ సంఖ్య 19 కాగా, తమకు 20 మంది బలం ఉందని రెబల్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, కేవలం పార్టీ నుంచి విడిపోవడం సరిపోదని, మరో పార్టీలో విలీనం అయితేనే చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోనూ టీఎంసీ ఎమ్మెల్యేలు ఇటీవలే తిరుగుబాటు చేశారు. పార్టీలో అభిషేక్ బెనర్జీ నిరంకుశ వైఖరి, వారసత్వ రాజకీయాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తిరుగుబాటు నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, టీఎంసీ విధేయులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. నిజంగా బలం ఉంటే స్పీకర్కు లేఖ ఇవ్వాలని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి స్పీకర్ ఓం బిర్లా తీసుకోబోయే నిర్ణయంపైనే ఉంది.