నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు... ఆ వార్తలు అబద్ధం: కారుమూరి నాగేశ్వరరావు
- లిక్కర్ స్కాం కేసులో కారుమూరి అరెస్ట్ అంటూ వార్తలు
- అరెస్ట్ వార్తల్లో నిజం లేదన్న కారుమూరి
- ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని వెల్లడి
తమను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. "నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు.. ఉదయం నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. నా అరెస్ట్పై జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అవాస్తవం" అని ఆయన స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా గురువారం హైదరాబాద్లో నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం రవాణా కాంట్రాక్టు, టెండర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, తన అరెస్ట్ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.