టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్బై
- దీదీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా
- ఇప్పటికే రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్
- అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రకాశ్ చిక్
- వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్లో తీవ్ర సంక్షోభం
ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ను కలిసి ప్రకాశ్ చిక్ తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, ఆయన తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదే వారంలో టీఎంసీకి ఇది మూడో రాజీనామా. జూన్ 8న సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న మరో ఎంపీ సుస్మితా దేవ్ పార్టీని, పదవిని వీడారు. ఆమె బుధవారం ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో సమావేశం కావడంతో త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రకాశ్ చిక్ బరైక్.. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో పేరుంది. 2023లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్లోని ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన్ను పోటీకి దింపాలని పార్టీలో చర్చలు జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పార్లమెంటు, శాసనసభాపక్షాలలో మొదలైన ఈ వరుస రాజీనామాలు టీఎంసీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.