బెంగాల్లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు?
- అభిషేక్ బెనర్జీపై దాడితో బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు
- 1990లో మమతపై జరిగిన దాడిని గుర్తు చేసిన ఘటన
- రాజకీయ విభేదాలు పక్కనపెట్టి మమతకు అండగా నిలిచిన ఇండియా కూటమి
- దీదీకి ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ, సంఘీభావం తెలిపిన నేతలు
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత సంక్షోభంలో ఉన్న టీఎంసీకి ఈ ఘటన పెను షాక్కు గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. లైవ్ కెమెరాల ముందే ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో విరుచుకుపడ్డారు. హెల్మెట్ ఉండటంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత అభిషేక్ వీల్చైర్పై ఆసుపత్రిలో ఉనన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఈ కష్టకాలంలో మమతా బెనర్జీకి 'ఇండియా' కూటమి నుంచి అనూహ్య మద్దతు లభించింది. గతంలోని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పలువురు జాతీయ నేతలు ఆమెకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా మమతకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఖండించారు. అవసరమైతే అభిషేక్కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతాకు వచ్చి మరీ మమతను పరామర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్ వంటి వారు కూడా మద్దతు ప్రకటించారు. 1990లో జరిగిన దాడి మమతను బెంగాల్లో తిరుగులేని శక్తిగా మార్చింది. ప్రస్తుతం పార్టీ సంక్షోభంలో ఉన్న తరుణంలో అభిషేక్పై జరిగిన ఈ దాడి, బలహీనపడిన టీఎంసీకి, ప్రతిపక్ష కూటమికి కొత్త ఊపునిస్తుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.