రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on State Reconstruction at Mahanadu
  • మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
  • ఎన్నికల నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణ
  • టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్న సీఎం
  • రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ
  • పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళ‌తామని వెల్లడి
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళుతుంద‌ని ఆయన ఉద్ఘాటించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన మహానాడులో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. "మీటింగ్ మోడల్ మారిందే తప్ప, మహానాడు విధానం మారలేదు. వాహనాల హోరు తగ్గిందేమో కానీ, కార్యకర్తల్లో జోరు తగ్గలేదు" అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

కార్యకర్తల త్యాగాలను స్మరించుకున్న చంద్రబాబు 
గత ఐదేళ్లలో పార్టీ ఎదుర్కొన్న కష్టాలను, కార్యకర్తల త్యాగాలను చంద్రబాబు ఉద్వేగంగా గుర్తుచేసుకున్నారు. దాడులు, హింస, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా టీడీపీ వెనకడుగు వేయలేదని అన్నారు. "నరహంతకులు పీకలు కోస్తున్నా మన కార్యకర్తలు జెండాను వీడలేదు. చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా 'జై చంద్రబాబు, జై తెలుగుదేశం' అంటూ అమరుడయ్యారు. ఆ స్ఫూర్తి కలకాలం నిలుస్తుంది" అని ఆయన నివాళులర్పించారు. తనను అక్రమంగా జైల్లో పెట్టారని, లోకేశ్‌ యువగళం పాదయాత్రను అడ్డుకున్నారని, అయినా ప్రజాస్వామ్యం కోసం టీడీపీ నిలబడిందని వివరించారు.

పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవ‌మ‌న్న‌ చంద్రబాబు   
టీడీపీ ఆవిర్భావం, సిద్ధాంతాలను చంద్రబాబు పునరుద్ఘాటించారు. "కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించింది. జాతీయ జెండా దేశానికి గౌరవం అయితే, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం" అని ఆయన అభివర్ణించారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ నిరంతరం పోరాటం చేస్తోందని, ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని తెలిపారు. బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని, ప్రజలు ఆ బాధ్యతను తమకు అప్పగించారని అన్నారు.

మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం పెద్దపీట
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే, నేడు 'తల్లికి వందనం' వంటి పథకాలతో వారి గౌరవాన్ని పెంచుతున్నామన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu
TDP Mahanadu
Telugu Desam Party
Andhra Pradesh
State Reconstruction
Welfare Schemes
Women Empowerment
Janasena
BJP Alliance
Political Speech

More Telugu News