చిప్ నుంచి షిప్ వరకు... ఏపీని జెట్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu AP to Develop at Jet Speed from Chip to Ship
  • టెక్నాలజీతో ఏపీని వేగంగా ముందుకు తీసుకెళతామన్న సీఎం చంద్రబాబు
  • అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామని ప్రకటన
  • ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం
  • 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వెల్లడి
  • చిప్ నుంచి షిప్ వరకు తయారీపై దృష్టి సారించామని స్పష్టం
టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ను జెట్ స్పీడ్‌తో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మెటా, అమెజాన్, జోహో వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని, యువతకు అపార అవకాశాలు సృష్టిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సోమవారం విజయవాడలో జరిగిన 'ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీపై ఆధారపడి ఉందని, దీన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 

అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా మారుస్తామని, క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తిని కూడా ఇక్కడే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. యువత, విద్యాసంస్థలు ఈ నూతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జెన్ జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని తెలిపారు.

రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామని, విశాఖపట్నాన్ని ప్రపంచానికే డేటా సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు. స్టీల్, అల్యూమినియం, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కీలక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్‌గా, రాయలసీమను రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కేవలం 36 రోజుల్లోనే ఐదో తరం ఫైటర్ జెట్ యుద్ధ విమానాల టెస్టింగ్ ఫెసిలిటీని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సూర్యలంక, గండికోట వంటి పర్యాటక ప్రాంతాలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.

ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన 'చిప్ టు షిప్' పిలుపునకు అనుగుణంగా రాష్ట్రంలో మాన్యుఫ్యాక్చరింగ్‌పై దృష్టి సారించామని సీఎం తెలిపారు. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, పరిశ్రమలు వాస్తవ రూపంలో కార్యకలాపాలు ప్రారంభించేలా చూస్తున్నామని, 'సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్' తమ ప్రభుత్వ విధానమని పునరుద్ఘాటించారు. గత 23 నెలల్లో నెలకు రూ.లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.

ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల పాలసీలను తీసుకొచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. 'వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్' లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్రం నుంచి 100 యునికార్న్ సంస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కళావేదికను ప్రారంభించిన సీఎం
అంతకుముందు, విజయవాడలో 4.4 ఎకరాల విస్తీర్ణంలో 1.45 లక్షల చదరపు అడుగుల స్థలంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి మరో ఐదు కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తామని ఈ వేదికగా సీఎం హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh development
AP MSME growth
Quantum Valley Amaravati
AP investments
Vishakapatnam data center
Rayalaseema development
AP industrial policy
AP tourism
Dr BR Ambedkar Kala Vedika

More Telugu News