మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్

Payyavula Keshav Fires at Jagan Self Certificates
  • తాను మంచోడినంటూ జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడన్న కేశవ్ 
  • ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శలు
  • రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబమే అని ఆరోపణ
  • రాజారెడ్డి అకృత్యాలపై త్వరలో సమగ్ర పుస్తకం విడుదల చేస్తామని వెల్లడి
  • గొడ్డలి పార్టీ విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని ఉద్ఘాటన
తనకంటే మంచోడు లేడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ‘సెల్ఫ్ సర్టిఫికెట్లు’ ఇచ్చుకోవడం విడ్డూరంగా ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. జగన్ ఎన్నటికీ బాధితుడు కాదని, ఆయనో నేర చరిత్ర కలిగిన నిందితుడని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన క్రిమినల్ చర్యలను కప్పిపుచ్చుకునేందుకే జగన్ శాంతిదూతలా నటిస్తున్నారని విమర్శించారు. శనివారం విజయవాడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్‌ది నేర చరిత్ర.. ఫ్యాక్షన్‌కు ఆద్యులు వారే

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, “జగన్ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీకి వచ్చినప్పుడల్లా కొత్త వాదనలు తెరపైకి తెస్తారు. నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి తనకంటే ఉత్తముడు, మంచోడు లేడంటూ సొంతంగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. సొంత బాబాయ్ వివేకాపై గొడ్డలివేటు వేసి, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన జగన్ చరిత్ర రాష్ట్రంలో నిక్కరు వేసుకునే పిల్లాడిని అడిగినా చెబుతాడు. అలాంటి సున్నితమైన విషయంలోనూ పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుకుంటున్నారు” అని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి నేరమయ, ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రవేశపెట్టిందే వైఎస్ కుటుంబమని పయ్యావుల ఆరోపించారు. “కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైన కక్షలను వ్యవస్థీకృతం చేసి రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత జగన్ తాత రాజారెడ్డిది. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ఫ్యాక్షనిజానికి అధికార అండదండలు లభించాయి. పులివెందుల నియోజకవర్గంలోని పార్నపల్లి గ్రామంలో టీడీపీకి మెజార్టీ వచ్చిందన్న ఒకే ఒక్క కారణంతో, ఆ గ్రామ నేతల ఇళ్లకు డ్రిల్లింగ్ చేసి డైనమైట్లతో పేల్చివేసిన భయానక చరిత్ర వారిది. ఈ ఘటనను రాయలసీమ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రత్యర్థులపై దాడి చేయించి, తాము వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా ఎలిబీ సృష్టించుకునే కొత్త నేర సంస్కృతి వారిదే. పులివెందులలో రాజారెడ్డి హయాంలో సాగిన అరాచకాలు, హత్యారాజకీయాలపై త్వరలోనే సమగ్ర ఆధారాలతో ఒక పుస్తకాన్ని తీసుకువస్తాం” అని పయ్యావుల ప్రకటించారు.

నాడు విధ్వంసం.. నేడు నిర్మాణం

జగన్ ఐదేళ్ల పాలనలో ప్రతి వ్యవస్థ, ప్రతి రంగం, ప్రతి ప్రాంతంపైనా గొడ్డలివేటు వేశారని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ‘గొడ్డలి పార్టీ’ అనాల్సి వస్తోందని పయ్యావుల విమర్శించారు. “ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయ్యాకే రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమైంది. జగన్ తన పాలనలో పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును అంధకారం చేశారు. అచ్చెన్నాయుడి నుంచి చంద్రబాబు దాకా అరెస్టులతో రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించారు. నాడు జగన్ పొక్లెయిన్లను విధ్వంసానికి వాడితే, నేడు కూటమి ప్రభుత్వం అదే పొక్లెయిన్లను రాష్ట్ర పునర్నిర్మాణానికి వినియోగిస్తోంది. సుమారు 800 పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నాం. యువత వైఎస్ ఫ్యామిలీ విధ్వంసకర చరిత్రను తెలుసుకోవాలి,” అని పిలుపునిచ్చారు.

తండ్రినే ముద్దాయిని చేసిన ఘనత జగన్‌ది

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోర్టు కేసుల్లో ముద్దాయిగా మార్చింది స్వయంగా జగనేనని, ఈ నిజాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారని పయ్యావుల గుర్తుచేశారు. “నాడు వైఎస్సార్‌ను కోర్టులో ముద్దాయిగా చేర్చిన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్ తన ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇచ్చి సత్కరించారు. వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపించి, ఆ తర్వాత అదే సంస్థకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? వైఎస్ మరణం వెనుక జగన్ పాత్ర ఉందని మంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ అన్నారు, దానికి జగన్ సమాధానం చెప్పగలరా?” అని పయ్యావుల ప్రశ్నించారు.

వైఎస్సార్ పాదయాత్రలో అస్వస్థతకు గురైతే తల్లి విజయమ్మ పరామర్శించారు గానీ జగన్ వెళ్లలేదని, వివేకాను చంపిందెవరో ఆయన కుమార్తె సునీత చెబుతుంటే జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. నేరం చేయడమే నైజంగా మార్చుకున్న గొడ్డలి పార్టీ సమాజానికి అత్యంత హానికరమని ఆయన హెచ్చరించారు. 
Go Back to Shorts
Jagan Mohan Reddy
Payyavula Keshav
Andhra Pradesh Politics
YS Jagan
TDP
BJP
Viveka Reddy murder case
Faction politics
Corruption
Andhra Pradesh government

More Telugu News