వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Healthy People are Lucky
  • చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • హారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటానన
  • ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం
  • రాష్ట్రంలో వైద్యరంగానికి రూ. 19,305 కోట్లు కేటాయించామని వెల్లడి
  • నీటి సంరక్షణతో అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు, పచ్చదనం పెరిగాయని వివరణ 
  • సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ విడుదల చేశామని స్పష్టం
"ఆహారమే ఔషధం, వంటశాలే ఔషధ శాల. ఈ మాట నేను ఎప్పుడూ చెబుతాను. మనం తినే ఆహారమే మనకు తిరుగులేని ఆరోగ్యాన్ని అందిస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం కండ్రిగలో నిర్వహించిన 'సంజీవని' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. తన వరకు తాను పూర్తి ఆహార నియమాలు పాటిస్తానని, మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంపద ఉన్నవాళ్లకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అదృష్టవంతులని ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా 'సంజీవని' కార్యక్రమం ప్రాముఖ్యతను సీఎం వివరించారు. "రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవనిని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో, డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమానికి 'సంజీవని' అని పేరు పెట్టాం. సంపద కంటే ఆరోగ్యమే గొప్పది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అన్నారు" అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాధులు రాకముందే గుర్తించి, నివారించేందుకు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు.

గత జూలైలో కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 42 రకాల వైద్య పరీక్షలను ప్రజల ఇళ్ల వద్దే నిర్వహించి, రిపోర్టులు అందిస్తామన్నారు. డాక్టర్ అపాయింట్‌మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ వంటి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా కూడా వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒక ఏఐ డాక్టర్ ఉంటాడని స్పష్టం చేశారు.

వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబాలను గట్టెక్కించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305 కోట్లు కేటాయించామని, 15వ ఆర్థిక సంఘం నుంచి దేశంలోనే అత్యధికంగా రూ.2,601 కోట్ల ఆరోగ్య గ్రాంట్లు సాధించామని గుర్తుచేశారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల విలువైన వైద్యం, ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.25 లక్షల వరకు ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సీఎం అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో భూగర్భ జలాలను పెంచగలిగామని, దీనికి అన్నమయ్య జిల్లానే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం చర్యలతో అక్కడ భూగర్భ జలాలు 8.5 మీటర్లు పెరిగి, పచ్చదనం పెరిగిందన్నారు. రాష్ట్రమంతా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే, అన్నమయ్య జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయని, పిడుగురాళ్లలో 49 డిగ్రీలు నమోదైతే, అన్నమయ్యలో 40 డిగ్రీలే ఉందని నివేదికలను ఉటంకించారు.

సాగునీటి ప్రాజెక్టులపై సంకల్పంతో పనిచేస్తున్నామని, ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో క్యాలెండర్ విడుదల చేశామని చంద్రబాబు తెలిపారు. నీవా పనులు పూర్తిచేసి పూతలపట్టు మీదుగా చిత్తూరు వరకు కృష్ణా నీటిని తెస్తామని, కల్యాణి డ్యాంకు కూడా నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. గాలేరు-నగరి, మల్లెమడుగు, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి ప్రాజెక్టుల పూర్తికి గడువులను ప్రకటించారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే తమ లక్ష్యమని, ఆ దిశగా నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Sanjeevani Program
Andhra Pradesh Health
Chittoor District
Digital Health Records
Health is Wealth
Preventive Healthcare
AI Doctor
Universal Health Policy
Water Management

More Telugu News