పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

Pawan Kalyan Announces Tourist Police System for Tourist Safety
  • ఏపీలో 'పర్యాటక పోలీసు' వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదన
  • పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్
  • మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • గత ప్రభుత్వ హయాంలోనూ 20 చోట్ల టూరిస్ట్ పోలీస్ అవుట్‌పోస్టులు ప్రారంభం
‘అటవీశాఖ, పర్యాటకశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కలసి ఓ కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఏమున్నాయో గుర్తించాలి. సుమారు 200 ప్రాంతాలను గుర్తిస్తూ, అక్కడున్న సౌకర్యాలు, సదుపాయాలు గురించి పూర్తి వివరాలు సేకరించండి. దీనిపై అయిదు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే పర్యాటకుల భద్రత అనేది చాలా ముఖ్యం. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలను దాటి కొత్త ప్రదేశాలను చూసేందుకు రాష్ట్రంలోకి వచ్చే వారికి పూర్తి భద్రత కల్పించేందుకు ‘పర్యాటక పోలీసు’ అనే కొత్త విధానంపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుందాం’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. 

అటవీశాఖతో పర్యాటక శాఖ సమన్వయం చేసుకుంటే ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయన్నారు. అద్భుతమైన అనుభూతి పర్యాటకులకు సొంతం అయితే, వారు పదిమందికి చెబుతారు. ఫలితంగా రాష్ట్రం పర్యాటకానికి స్వర్గంగా మారుతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పవన్ కల్యాణ్ ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘‘పర్యాటక ప్రాంతాలతోపాటు దేవాలయాలను దర్శించే నిమిత్తం వచ్చే భక్తులకు భద్రతను కల్పించేలా పని చేయాలన్నదే నా ఆకాంక్ష. దీనివల్ల రాష్ట్రంలో 50 వేల మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు, పూర్తి భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దేవాదాయ శాఖను సమన్వయం చేసుకొని పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చే వారికి తగిన భద్రతనిచ్చేలా కార్యాచరణ రూపొందిద్దాం. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి.  

గ్రామాలకు పర్యాటక శోభ తీసుకురావాలి 

రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలున్న గ్రామాలు చాలా ఉన్నాయి. అయితే వాటిని చూసేందుకు పర్యాటకులు వెళితే అక్కడ సదుపాయాలు లేకపోవడం నిరాసక్తత కలిగిస్తోంది. దీంతో చాలామంది ఆసక్తి చూపించడం లేదు. పంచాయతీరాజ్ అధికారులు దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. ఈశాన్య రాష్ట్రాలకు పర్యటనకు వెళితే వారు ఇళ్లలోనే తగిన సదుపాయాలు కల్పిస్తారు. అతిథిని దేవుడిలా చూసుకుంటారు. అలాంటి విధానం రాష్ట్రంలోని గ్రామాల్లో తీసుకురావాలి. పైలెట్ ప్రాజెక్టులుగా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని పర్యాటకం అభివృద్ధి చేయండి. ఇది అమలు అయితే గ్రామాల ముఖచిత్రం మారుతుంది. ఆర్థికంగానూ బలోపేతం అవుతాయి.  ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకుల సంఖ్యను పెంచాలి. కర్నూలు జిల్లా కృష్ణ జింకలకు అత్యంత ప్రసిద్ధి.  అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులు వీక్షించేలా అభివృద్ధి చేయాలి. నల్లమలలో ఉన్న బైర్లూటి, నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలు… ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతలు గుర్తించి, దానికి అనుగుణంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. 

ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకుల సంఖ్యను పెంచాలి. కర్నూలు జిల్లా కృష్ణ జింకలకు అత్యంత ప్రసిద్ధి.  అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులు వీక్షించేలా అభివృద్ధి చేయాలి. నల్లమలలో ఉన్న బైర్లూటి, నెల్లూరు జిల్లాలో  ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలు… ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతలు గుర్తించి, దానికి అనుగుణంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. 

క్షేత్ర స్థాయికి వెళ్లండి

అటవీ, పర్యాటక, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయండి. ఎకో టూరిజంలో చూడాల్సిన ప్రదేశాలు, దానికి తగిన రూట్ మ్యాప్ తో పాటు అక్కడున్న వసతులు, సౌకర్యాలపై ప్రత్యేకమైన యాప్ రూపొందించండి. గుర్తించిన 200 దర్శనీయ ప్రాంతాలను టూరిజం సర్క్యూట్ గా తీసుకొచ్చి, పర్యాటక సంస్థలు ఇచ్చే టూరిజం ప్యాకేజీలు గుర్తించేలా తయారు చేయాలి. ప్రకృతికి, వన్య ప్రాణులకు  ఇబ్బంది కలగకుండా ఎకో టూరిజం ప్రాంతాలను తయారు చేయాలి. సందర్శనీయ ప్రాంతాల్లో ఉన్న వసతులు, అవకాశాలు ముందుగా గుర్తించాలి. అక్కడ పరిస్థితులను సమీక్షించుకొని, అవసరం అయిన సౌకర్యాలను కల్పించాలి. దీనిపై అన్ని పరిశీలించిన తర్వాత అటవీ, పర్యాటక శాఖలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై జూన్ 10వ తేదీలోపు వీటిపై ఎంఓయూ చేసుకోవాలి.  రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను గుర్తించి, దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి గారితో మాట్లాడి, పర్యాటకశాఖ మరియు దేవాదాయశాఖ సేవలను ఒకే  గొడుగు కిందకు తీసుకురావాలి. గతంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంపై ఇచ్చిన సూచనల ప్రకారం.. భక్తులు దైవదర్శనంతోపాటు సమీపంలోని ప్రకృతి ప్రాంతాలను కలిపి కాంబో టూరిజం ప్యాకేజీలు డిజైన్ చేయాలి’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో టూరిజం అధికారులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh Tourism
Tourist Police
Eco Tourism
AP Tourism Development
Temple Tourism
Rural Tourism
Kandula Durgesh
Anam Ramnarayana Reddy

More Telugu News