వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
- డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు
- బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రాజమండ్రి స్పెషల్ కోర్టు
- రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి స్పెషల్ కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. సాక్షులను బెదిరించిన కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.
తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానంటూ ఈ కేసులోని నలుగురు కీలక సాక్షులను అనంతబాబు బెదిరించినట్లు బాధితులు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్ 24న ఆయన్ను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మరోవైపు, డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో సాక్షుల విచారణ కోర్టులో వేగంగా సాగుతోంది. కీలక సాక్షులైన మణికంఠ, శివదుర్గాప్రసాద్లు ఘటన జరిగిన సమయంలో తాము చూసిన వివరాలను జడ్జికి వివరించగా, కోర్టు వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు మిగిలిన సాక్షుల విచారణ కొనసాగనుండగా.. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబును కూడా కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హత్యకేసులో ఆయన బెయిల్ను కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.