ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం

AP CEO Vivek Yadav Announces Voter List Purification Drive
  • జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే
  • నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన
  • జులై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఇంటింటి సర్వే ద్వారా మరణించిన వారు, నకిలీ, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తామని తెలిపారు. అదే సమయంలో ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కఠినమైన ధ్రువీకరణ చేపడతామని హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారని వివేక్ యాదవ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారని, అందులో ఒకటి ఓటరు పూర్తిచేసి ఇవ్వాలని, రెండోదానిపై బీఎల్‌వో సంతకం చేసి రశీదుగా అందజేస్తారని తెలిపారు. "ఓటరు జాబితాలో అనర్హులకు చోటుండకూడదు, అర్హులను జాబితా నుంచి తప్పించకూడదు అనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపడుతున్నాం" అని ఆయన అన్నారు.

సర్వే పూర్తయ్యాక జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని సీఈఓ తెలిపారు. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారనీ, ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసి సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో జరిగిన తర్వాత, విభజిత రాష్ట్రంలో ఇలాంటి సమగ్ర సవరణ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
Go Back to Shorts
Vivek Yadav
Andhra Pradesh
voter list
voter survey
electoral roll
booth level officers
election commission
voter list purification
special summary revision
AP elections

More Telugu News