చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు

  • అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు
  • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో ఘటన
  • ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
ఆపదలో ఉన్నామని ఆదుకోవాలని కోరిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి అండగా నిలిచారు. వినతి స్వీకరించిన 24 గంటల్లోనే సహాయం మంజూరు చేసి, తన మార్క్ పాలనను మరోసారి చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 16న 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కరరావు దంపతులు సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని, వైద్య ఖర్చులకు ఉన్నదంతా అయిపోయిందని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వారి పరిస్థితికి వెంటనే చలించిన చంద్రబాబు, తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఆయన చెప్పినట్టుగానే, మరుసటి రోజే (మే 17న) ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి శ్రీకాకుళం కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. బాధితులిద్దరికీ సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ చెక్కులను నిన్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎం సహాయ నిధి ద్వారా రూ. 3 కోట్లు అందించామని తెలిపారు.
 
 

Chandrababu Naidu
Andhra Pradesh
Srikakulam
Narasannapeta
CM Relief Fund
Financial Assistance
Gorle Jyothi
Simhadri Bhaskar Rao
Buggu Ramana Murthy
Swarnandhra Swachandhra

More Telugu News