విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర
- బందరు చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న కొల్లు రవీంద్ర
- రోడ్లు, తాగునాటి సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
- గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా చేసిందని విమర్శ
బందరు (మచిలీపట్నం) చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బందరులో తాగునీటి పైపులైన్లు, డీడబ్ల్యూఎమ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన... ప్రతి ప్రాంతానికి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కేవలం విమర్శలకే పరిమితమైన మాజీ మంత్రి పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. అభివృద్ధి పనులను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 28 లక్షలతో పనులు చేపడుతున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో బందరు రూపురేఖలు మారుస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా చేసిందని, కరగ్రహారం లేఅవుట్ పేరుతో భూములను తక్కువకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మి దోచుకున్నారని ఆరోపించారు. ఇనుము దొంగతనంపై పేర్ని నాని చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ, నిరుపయోగంగా ఉన్న ఇనుమును ప్రజల అవసరాల కోసం వినియోగించడంలో తప్పులేదని మంత్రి స్పష్టం చేశారు.