తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ
- 32 ఏళ్లపాటు పోలీసు అధికారిగా సేవలందించిన శివధర్ రెడ్డి
- పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం
- సామాన్యులకు పోలీసులను దగ్గర చేయడంలో ఎంతో సాధించామన్న శివధర్ రెడ్డి
తెలంగాణ పోలీస్ శాఖలో మరో చిరస్మరణీయ అధ్యాయం ముగిసింది. సుమారు 32 ఏళ్ల పాటు నిష్కళంకమైన సేవలు అందించిన డీజీపీ బి.శివధర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ... 1970-80ల నాటి కఠినమైన పోలీసింగ్ పద్ధతుల నుంచి నేటి ఆధునిక, సిటిజన్ ఫ్రెండ్లీ విధానాల వరకు సాగిన పరిణామ క్రమాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో పోలీసులపై ఉన్న అపవాదులను తుడిచివేసి, సామాన్య ప్రజలకు పోలీసులను దగ్గర చేయడంలో ఎంతో సాధించామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలతో ఏర్పడిన దూరాన్ని తగ్గించి, విశ్వసనీయతను పెంచామని చెప్పారు
.
తన స్వరాష్ట్రానికి డీజీపీగా సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖను తీర్చిదిద్దిన తృప్తితో తాను విధులకు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న సి.వి. ఆనంద్ ను ఒక సమర్థవంతమైన అధికారిగా ఆయన అభివర్ణించారు.