మోదీ హైదరాబాద్ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం
- మే 10న తెలంగాణలో పర్యటించనున్న మోదీ
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగసభ
- 3 లక్షల మందిని సభకు తరలించే లక్ష్యంలో బీజేపీ శ్రేణులు
మే 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటంచనున్నారు. కేంద్రంలో మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని తొలిసారిగా తెలంగాణకు వస్తుండటంతో, దీనిని ఒక చారిత్రాత్మక విజయ సంకేతంగా మలిచేందుకు రాష్ట్ర బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు 'జనాగ్రహ సభ'గా రాష్ట్ర బీజేపీ నేతలు నామకరణం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, విపక్ష బీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను (ఆగ్రహాన్ని) ఓట్లుగా మలుచుకోవాలన్నది బీజేపీ ఉద్దేశ్యం.
ఈ సభను రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. సుమారు 3 లక్షల మందిని సభకు తరలించడం ద్వారా అటు కాంగ్రెస్కు, ఇటు బీఆర్ఎస్కు తమ బలాన్ని చాటాలని భావిస్తున్నారు. మరోవైపు, కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, నేషనల్ హైవేల విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం ద్వారా 'డబుల్ ఇంజిన్ సర్కార్' ఆవశ్యకతను ప్రధాని నొక్కి చెప్పనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పట్టు సాధించేందుకు మోదీ పర్యటనను ఒక గొప్ప అవకాశంగా వాడుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావించడం ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది.