తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ.. అసలు కారణం ఇదేనన్న మంత్రి ఉత్తమ్

Fuel Crisis In Telangana Rumors And Bulk Buying Trigger Shortage says Minister Uttam Kumar Reddy
  • ధరల పెరుగుదల వదంతులతోనే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్ప‌డింద‌న్న మంత్రి
  • అసాధారణ డిమాండ్ కారణంగా బంకుల్లో ఖాళీ అవుతున్న స్టాక్
  • సరఫరాను 126 శాతానికి పెంచి పరిస్థితిని చక్కదిద్దుతున్నామ‌న్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • రైతులకు, లారీ యజమానులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక చర్యలు
  • ఆందోళన వద్దు, నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రజలకు ప్ర‌భుత్వం భరోసా
తెలంగాణలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇంధన ధరలు భారీగా పెరగబోతున్నాయంటూ వ్యాపించిన వదంతుల వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేస్తుండటంతో బంకుల వద్ద భారీ రద్దీ ఏర్పడి, డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందని వివరించారు.

ఈ పరిస్థితికి పలు కారణాలు దోహదం చేశాయని ప్రభుత్వం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయనే ప్రచారం ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. దీనికి తోడు పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్ ధర లీటరుకు రూ.150కి చేరడంతో ఆ వినియోగదారులు కూడా తక్కువ ధరకే లభించే సాధారణ బంకులపై ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ఏపీ, మహారాష్ట్ర వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కూడా తెలంగాణలోని బంకుల్లోనే ఇంధనం నింపుతుండటంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో వచ్చిన సరుకు వచ్చినట్లే అమ్ముడైపోయి, బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి.

ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరాను సాధారణం కంటే 126 శాతం పెంచినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర చమురు కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను నిరంతర సరఫరా కోసం రంగంలోకి దించారు. ఈ నెల 27వ తేదీ నాటికి రోజువారీ డీజిల్ పంపిణీ 151 శాతం, పెట్రోల్ పంపిణీ 95 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం పంట కోతలు, ధాన్యం కొనుగోళ్ల సమయం కావడంతో రైతులకు, రవాణా రంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి మూడు గంటలకోసారి బంకుల్లోని నిల్వలను సమీక్షిస్తూ, కొరత ఉన్న ప్రాంతాలకు తక్షణమే ట్యాంకర్లను పంపిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Fuel Crisis
Petrol
Telangana

More Telugu News