పద్మశ్రీ అవార్డులు-2027... నామినేషన్లకు తుది గడువు ఇదే!

Centre announces time line for Padma Awards nominations
  • పద్మ అవార్డులు 2027 నామినేషన్లకు జూలై 31 తుది గడువుగా నిర్ణయం
  • రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే నామినేషన్లు స్వీకరణ
  • సామాన్యులు సైతం స్వయంగా నామినేట్ చేసుకునే అవకాశం
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచన
దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే పద్మ అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులు పంపేందుకు జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు సోమవారం వెల్లడించింది.

ఈ ఏడాది మార్చి 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా, నామినేషన్లను కేవలం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (awards.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అత్యంత గౌరవప్రదమైన పురస్కారాలుగా గుర్తింపు పొందాయి.

నామినేషన్లు పంపేవారు సంబంధిత వ్యక్తి సాధించిన అసాధారణ విజయాలు, సేవలను వివరిస్తూ గరిష్ఠంగా 800 పదాలకు మించకుండా ఒక సైటేషన్ జతచేయాలని హోం శాఖ సూచించింది. పద్మ అవార్డులను "ప్రజల పద్మ" (పీపుల్స్ పద్మ)గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, కాబట్టి పౌరులందరూ తమను తాము నామినేట్ చేసుకోవడంతో పాటు ఇతరులను కూడా సిఫార్సు చేయవచ్చని తెలిపింది.

సమాజంలో నిస్వార్థ సేవ చేస్తున్న మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు వంటి వారిని గుర్తించి నామినేట్ చేయాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సహా ప్రభుత్వ సేవకులు ఈ అవార్డులకు అర్హులు కారని, అయితే వైద్యులు, శాస్త్రవేత్తలకు దీని నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలను ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తారు.
Go Back to Shorts
Padma Awards-2027
Nominations
Civilian Awards
India

More Telugu News