బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్లి.. పెళ్లికూతురు చెల్లిని తీసుకెళ్లిన అధికారులు
- గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ఓ గ్రామంలో ఘటన
- బాల్యవివాహాన్ని ఆపేందుకు వెళ్లిన ఐసీడీఎస్, పోలీసులు
- అప్పటికే మైనర్ పెళ్లికూతురుని అక్కడి నుంచి తప్పించిన పెద్దలు
- చెల్లిని పెళ్లికూతురుగా భావించి ఆమెను తీసుకెళ్లిన అధికారులు
- ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసిన పెద్దలు
గద్వాల జిల్లాలో ఐసీడీఎస్, పోలీసు అధికారుల నిర్వాకం ఒక మైనర్ బాలిక జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఒక చిన్న పొరపాటు వల్ల జరగాల్సిన వివాహం ఆగిపోవాల్సింది పోయి, ఆ పెళ్లి సైలెంట్ గా జరిగిపోయింది. అధికారుల కళ్లు గప్పి పెద్దలు పెళ్లి జరిపించేశారు.
అసలేం జరిగిందంటే..?:
ధరూర్ మండలానికి చెందిన యువకుడికి, గద్వాల మైనర్ బాలికకు గత బుధవారం రాత్రి వివాహం జరగబోతోంది. బాల్య వివాహం గురించి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు బుధవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. కానీ, అధికారులు వస్తున్నారన్న సమాచారంతో పెళ్లి కూతురును అప్పటికే పెద్దలు అక్కడి నుంచి తప్పించారు. అక్కడకు వచ్చిన అధికారులు.. అక్కడ ఉన్న పెళ్లి కూతురు చెల్లినే వధువుగా భావించి... కనీసం ఆధార్ కార్డులోని ఫొటోను కానీ, పెళ్లి పత్రికలోని పేరును కానీ సరిపోల్చుకోకుండా ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
తన చిన్న కూతురిని అధికారులు తీసుకెళ్తుంటే పెళ్లికూతురు తల్లిదండ్రులు, పెద్దలు సైలెంట్గా ఉండిపోయారు. అధికారులు వెళ్లిన వెంటనే, మైనర్ బాలికకు గుడిలో పెళ్లి జరిపించేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గద్వాల అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే వధూవరులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.