రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు
- ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకోనున్న చంద్రబాబు
- గెస్ట్ ఆఫ్ హానర్ గా కూడా ప్రత్యేక ఆహ్వానం
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముంబైలో పర్యటించనున్నారు. ప్రముఖ వాణిజ్య పత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఆయన అందుకోనున్నారు. ముంబైలో జరగనున్న 26వ కార్పొరేట్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ యాజమాన్యం 'గెస్ట్ ఆఫ్ హానర్' (గౌరవ అతిథి)గా ప్రత్యేకంగా ఆహ్వానించింది.
పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దిగ్గజ పారిశ్రామికవేత్తల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.