అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి
- రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్న సబిత
- ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు పెడుతోందని విమర్శ
- కాళేశ్వరం ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తోందని మండిపాటు
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ తీర్పును ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా అభివర్ణించారు.
తాజాగా సబిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో, అధికార అహంకారంతో అక్రమ కేసులు పెడుతోందని, హైకోర్టు తీర్పుతో న్యాయం ఎటువైపు ఉందో స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ తప్పు చేయలేదని ఈ తీర్పుతో రుజువైందని అన్నారు.
రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టును నిర్మించారని, కానీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించారు. విపక్షాలపై చిల్లర కేసులు పెట్టడం మానుకుని, ప్రాజెక్టులో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిచేసి రైతులకు నీరందించడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.