ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్
- ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులు
- రేపు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
- ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్
- సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 (1) ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించారు. సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 26న జస్టిస్ లీసా గిల్ పేరును ఏపీ హైకోర్టు సీజే పదవికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
జస్టిస్ లీసా గిల్ గతంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ప్రకారం, ఆమెను మార్చి నెలలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించేలోపు అక్కడి కోర్టు పరిపాలన వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు.