ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

No need to fear of AI CJI
  • ఏఐ విషయంలో ఆందోళనలు వద్దన్న ప్రధాన న్యాయమూర్తి
  • కేసులను పరిష్కరించడానికి నైతిక విలువలు అవసరమన్న సీజేఐ
  • ఏఐకి ఎలాంటి భావోద్వేగాలు ఉండవని వ్యాఖ్య
కృత్రిమమేధ (ఏఐ) వినియోగంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో ఏఐ వాడకంపై ఆయన సూచనలు చేశారు. ఏఐ విషయంలో ఆందోళనలు వద్దని అన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలంటే అంతర్గత పరిమితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

కర్ణాటక రాష్ట్ర స్టేట్ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికత అనేది సలహాలు ఇవ్వడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఏఐ మనుషులకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో ఏఐ అనుసంధానం చేయాలంటే సమతౌల్యత పాటించాలని అన్నారు.

క్లిష్టమైన ప్రశ్నలతో కూడిన ఓ కేసు మీ ముందుకు వస్తే, ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు సమయం వెచ్చించి ఆలోచిస్తారని, దానిని పరిష్కరించాక మీరు గొప్ప అనుభూతిని పొందుతారని ఆయన అన్నారు. ఇలాంటి విషయాల్లో ఏఐ సామర్థ్యం సరిపోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఏఐ గురించి ఆందోళన అవసరం లేదని అన్నారు.

న్యాయాధికారులు ఉత్పాదకతను పెంచడానికి తగిన శిక్షణ తీసుకుంటారని, శ్రద్ధతో పనిచేస్తారని అన్నారు. కానీ ఏఐ డేటా ఆధారంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. మనుషులకు ఉండే విచక్షణ శక్తి ఏఐకి ఉండదని, నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ మనుషుల్లా ఆలోచించదని తెలిపారు. కేసులను పరిష్కరించడానికి నైతిక విలువలు, సామాజిక కోణాలు, రాజ్యాంగ నియమాలు, విలువల కట్టుబాటు ఉంటాయని, కానీ ఎలాంటి భావోద్వేగాలు లేని ఏఐ వల్ల ఇది సాధ్యం కాదని అన్నారు.
Go Back to Shorts
Supreme Court
CJI of Supreme Court
AI
Artificial Intelligence

More Telugu News