ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన.. వీడియో ఇదిగో!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాదులోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని, ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో విశ్లేషణ చేశారు. ఈ కథనం అటు ఏబీఎన్ ఛానల్ లో, ఇటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకు కాలమ్ లో ప్రచురితమైంది. ఇందులో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ క్యాడర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏపీ మహిళలను అవమానించారంటూ రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఆఫీసును ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆఫీసు వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తప్పలేదు. సమీపంలోనే అపోలో ఆసుపత్రి ఉండడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు. నిరసనకారులు వైసీపీ నేత అంబటి రాంబాబు నేతృత్వంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

Radha Krishna
ABN Andhra Jyothi
YCP Protest
Mavigan Comments
Ambati Rambabu
Andhra Pradesh Politics
YS Jagan
Political Analysis
Media Freedom
Hyderabad

More Telugu News