తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Tirumala Temple Sees Heavy Devotee Rush Darshan Takes 24 Hours
  • వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
  • గురువారం ఒక్కరోజే రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం
కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.

ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు శ్రీవారి సేవా సదన్ వరకు విస్తరించాయి. ఎటువంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. 

గురువారం నాడు శ్రీవారిని 79,603 మంది భక్తులు దర్శించుకున్నారు. 45,125 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Tirumala
Tirumala temple
Tirupati
TTD
Sri Venkateswara
Devotees
Darshan
Rush
Summer holidays
Hundi collection

More Telugu News