Shashi Tharoor: కేరళలో శశిథరూర్ కాన్వాయ్‌పై దాడి.. సిబ్బందిపై చేయిచేసుకున్న దుండగులు

కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాన్వాయ్‌ను కొందరు దుండగులు అడ్డగించి, భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వండూరు నియోజకవర్గ యూడీఎఫ్ అభ్యర్థి ఏపీ అనిల్‌కుమార్ తరపున ప్రచారం ముగించుకుని వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

వండూరు సమీపంలోని చెల్లితోడ్ వద్ద కారు, బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు థరూర్ వాహనాన్ని అడ్డగించారు. ఆయనను దూషించడంతో కలుగజేసుకున్న గన్‌మన్‌, డ్రైవర్‌పై వారు దాడి చేశారు. ఈ ఘటనపై థరూర్ గన్‌మన్‌ వండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, ఉమర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై ఆరా తీస్తున్నామని, విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

అంతకుముందు ప్రచారంలో మాట్లాడిన శశిథరూర్, కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువతకు రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Shashi Tharoor
Kerala
Kerala Elections 2024
Malappuram
UDF
AP Anil Kumar
Vandoor
Congress
Attack on Convoy
Kerala Politics

More Telugu News