Vijay: విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు విజయ్ భద్రత అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కల్పిస్తున్న భద్రత సరిపోవడం లేదని ఆరోపిస్తూ ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ లేఖలో ఓ సీనియర్ అధికారి పేరును తప్పుగా ప్రస్తావించడం కొత్త వివాదానికి దారితీసింది.

వివరాల్లోకి వెళితే, విజయ్‌కు 'Y' కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు సరిపోవడం లేదని టీవీకే ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 30న పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పెరంబూర్, కొళత్తూర్, విల్లివాక్కం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, పెరంబూర్, కొళత్తూర్‌లో ప్రసంగించిన తర్వాత, భద్రతా కారణాల రీత్యా విల్లివాక్కం పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. భారీగా తరలివస్తున్న జనాన్ని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తు సరిపోలేదని పార్టీ నేతలు పేర్కొన్నారు.

ఈ ఘటనపై టీవీకే మొదట తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పార్టీ కార్యనిర్వాహకుడు సి.టి.ఆర్. నిర్మల్ కుమార్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు దీనిపై ఒక లేఖ రాశారు. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన లేఖ కాపీతో అసలు వివాదం మొదలైంది. ఆ లేఖలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా అజయ్ కుమార్ భల్లా పేరును పేర్కొన్నారు. వాస్తవానికి, భల్లా ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హోం శాఖ కార్యదర్శి పదవిలో లేరు.

ఈ తప్పిదంపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక అధికారిక లేఖలో ఇలాంటి పొరపాటు దొర్లడం పార్టీ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 
Vijay
Tamilaga Vettri Kazhagam
TVK
Tamil Nadu Politics
Security Concerns
Election Campaign
Amit Shah
Ajay Kumar Bhalla
Perambur
Kolathur

More Telugu News